Ref: 6th june 2021, AndhraJyoti news Warangal district page.
రైలు కూత పెట్టేదెప్పుడో..?
కలగానే...
more... రామగుండం-మణుగూరు లైన్ నిర్మాణం
1999లో భూపాలపల్లి సింగరేణి కోసం ప్రతిపాదనలు
రైట్, వ్యాప్కో సంస్థల ద్వారా రెండు మార్గాల్లో సర్వే
22 ఏళ్లుగా లభించని మోక్షం
పార్లమెంటులో ప్రస్తావించని ఎంపీలు
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లికి రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇరవై ఏళ్ల క్రితమే అధికారులు ప్రతిపాదనలు చేశారు. 1999లో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ రైల్వే శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి భూపాలపల్లి వరకు రైల్వేలైన్ నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. భూపాలపల్లి బొగ్గును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు, అలాగే ఇక్కడి కోల్బెల్ట్ ఏరియాకు రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు ఈ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైట్ అనే సంస్థ ద్వారా జమ్మికుంట నుంచి భూపాలపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం రూట్ సర్వే చేయించారు. అయితే 13 నెలలలోనే బీజేపీ ప్రభుత్వం పడిపోవటంతో ఈ ప్రతిపాదనలు వెనక్కివెళ్లాయి. 1999-2004 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2005లో భూపాలపల్లి, మేడా రం మహా జాతరకు ఉపయోగపడేలా కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అప్పటి కరీంనగర్ జిల్లా రామగుండం నుంచి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు కొత్త రైల్వేలైన్ నిర్మాణం చేయాలని అప్పటి హన్మకొండ ఎంపీ బొయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. వ్యాప్కో సంస్థ ద్వారా ఈ రూట్లో లైన్ నిర్మాణం కోసం సర్వే చేయించారు. రామగుండం నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం జరిగితే బొగ్గు సరఫరాతో పాటు ప్రయాణికులకు ఈలైన్ అనువుగా ఉంటుందని భావించారు. మేడారం మహాజాతరకు భక్తుల చేరవేతకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇదే సమయంలో 2009లో చెల్పూరులో జెన్కో ఆధ్వర్యంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇక్కడ 1100 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి ఇతర ప్రాంతాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చెల్పూరుకు రైల్వేలైన్ అవసరం ఉందని జెన్కో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పారు. 2010లో రైట్ సంస్థతో మరోసారి రైల్వేలైన్ కోసం రూట్ సర్వే చేయించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. జెన్కో సంస్థ కూడా రూ.200 కోట్లు ఈ లైన్ నిర్మాణం కోసం వెచ్ఛించేందుకు ముందుకొచ్చింది. 2004 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ రైల్వేలైన్ ఫైల్ ఏమాత్రం ముందుకు కదల లేదు.
రైల్వేలైన్తో ప్రయోజనాలెన్నో..
భూపాలపల్లి ఏరియాలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సి వస్తోంది. ప్రయాణ సౌకర్యం లేకపోవటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా బొగ్గు ఆధారిత పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతం అయినప్పటికీ రైల్వే రూట్ లేకపోవటంతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం లేదు. దీంతో అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా కోల్బెల్ట్ ప్రాంతం దుస్థితి మారింది. మరోవైపు కేటీపీపీ కోసం రామగుండం, గోదావరిఖని ఏరియాల నుంచి బొగ్గును ఉప్పల్ రైల్వే స్టేషన్ వద్దకు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా చెల్పూరుకు తరలిస్తున్నారు. దీంతో సంస్థకు ఆర్థిక భారం పడుతోంది. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం జరిగితే కోల్ట్బెల్ట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇండస్ర్టీయల్ కారిడార్గా మారుతుంది. అంతేకాకుండా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే వారి ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇటీవలే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకంగా... ఆధ్యాత్మికంగా కాళేశ్వరం అభివృద్ధి చెందనుంది. నిత్యం వేలాది మంది రాకపోకలు ఉంటాయి. ఇలా పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి, బొగ్గు సరఫరా, దిగుమతి, ప్రయాణ సౌకర్యార్థం ఈ ప్రాంతానికి రైల్వేలైన్ ఎంతో అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పట్టించుకోని ఎంపీలు!
భూపాలపల్లికి రైల్వేలైన్ కోసం ఇరవై ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల డిమాండ్కు కార్యరూపం దాల్చాల్సిన ప్రజాప్రతినిధులు మౌ నంగా ఉండటం రైల్వేలైన్కు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూపాలపల్లి రైల్వేలైన్ కో సం 1998-99లో హన్మకొండ ఎంపీగా ఉన్న చాడా సురే్షరెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 1999 నుంచి 2004 వరకు మరోసారి ఆయన ఎంపీగా కొనసాగారు. అప్పటికే రెండుమూడు సార్లు రైల్వేలైన్ ప్రతిపాదనలపై సురే్షరెడ్డి ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయారు. 2004 నుంచి 2009 వరకు హన్మకొం డ ఎంపీగా వినోద్కుమార్ పనిచేశారు. ఆ సమయంలోనే చెల్పూరులో కేటీపీపీ ఏర్పడింది. వినోద్కుమార్ తన హయాంలోనే రైల్వెలైన్ కోసం ప్రతిపాదనలు చేశారు. అలాగే 2009 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్న సిరిసిల్ల రాజయ్య గానీ, 2014 నుంచి 2016 వర కు ఎంపీగా పనిచేసిన కడియం శ్రీహరి గానీ, 2016 నుంచి ఎంపీగా కొనసాగుతున్న పసునూటి దయాకర్ గానీ భూపాలపల్లి రైల్వేలైన్పై పార్లమెంట్ ప్రస్తావించి న దాఖలాలు లేవు. రైల్వేలైన్ అవసరాన్ని కేంద్ర ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎంపీలు రైల్వేలైన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఎప్పుడో రైలు కూత ఈ ప్రాంతంలో వినిపించేదని జిల్లా వాసులు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలు కూడా భూపాలపల్లికి రైల్వే మార్గం కోసం కేంద్రం పెద్దలపై ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు.